KCRను ఇరుకున పెట్టేలా నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయం

తెలంగాణకు చెందిన బిహార్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ విడుదలపై రాజకీయ దుమారం రేగింది.

Update: 2023-04-26 08:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు చెందిన బిహార్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ విడుదలపై రాజకీయ దుమారం రేగింది. ఓ వర్గం వారిని ఆకట్టుకునేందుకే నితీష్ కుమార్ సర్కార్ జైళ్ల నిబంధనలను మార్చివేసి గ్యాంగ్ స్టర్ ఆనంద్ మోహన్ విడుదలకు లైన్ క్లియర్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నితీష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయం ఇరుకున పెట్టేలా మారిందనే చర్చ జరుగుతున్నది.

1994లో జరిగిన మూకదాడిలో కృష్ణయ్య మరణం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చగా మారింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కృష్ణయ్య మరణం ఎన్నికల ఏడాదిలో మరోసారి తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కృష్ణయ్యది తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాతం. అయితే కృష్ణయ్య హత్య కేసులో దోషీగా ఉన్న ఆనంద్ మోహన్ కోసం నిబంధనలు మార్చి మరి అతడికి స్వేచ్ఛ కల్పించేలా నితీష్ కుమార్ చర్యలు తీసుకుంటుంటే ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గతేడాది బీహార్ కు వెళ్లి ఆ రాష్ట్రంలోని అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేసి వచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. రాష్ట్రంలోని ప్రజలను పట్టించుకోని కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి వెళ్లి మరీ చెక్కులు పంపిణీ చేస్తున్నారని విమర్శించాయి. ఆ విమర్శలపై సైలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు సొంత రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మర్డర్ కేసులో దోషులను బిహార్ ప్రభుత్వం విడుదల చేస్తుంటే కూడా మౌనం వీడటం లేదని బీఎస్పీ ఎటాక్ చేస్తోంది.

బిల్కిస్ బానో సరే.. నితీష్ సర్కార్ పనేంటో?

నితీష్ కుమార్ సర్కార్ తీరు కేసీఆర్ వరకే కాదు జాతీయ స్థాయిలో విపక్షాల కూటమికి సైతం విమర్శలు తెచ్చిపెట్టేలా మారిందనే టాక్ వినిపిస్తోంది. బిల్కిస్ బానో నిందితుల విడుదల విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. హంతకులకు బీజేపీ సర్కార్ వత్తాసు పలుకుతోందని మండిపడ్డాయి. ఇప్పుడు అదే విపక్ష కూటమిని ఏకతాటిపైకి తీసుకురావాలని చూస్తున్న నితీష్ కుమార్ ప్రభుత్వం ఓ దళిత ఐఏఎస్ హంతకుడిని జైలు నుండి విడుదల చేయడానికి ఏకంగా జైలు నిబంధనలు మార్చారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో నితీష్ కుమార్ వైఖరి ఇటు కేసీఆర్‌తో పాటు జాతీయ స్థాయిలో విపక్షాల కూటమికి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది.

మా కుటుంబాన్ని బిహార్ సర్కార్ పట్టించుకోలేదు: కృష్ణయ్య భార్య

బిహార్ సర్కార్ తీరుపై కృష్ణయ్య భార్య జి.ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త హత్య తర్వాత బిహార్ ను విడిచి స్వరాష్ట్రానికి వచ్చిన తమను బిహార్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న తాము ఎలా ఉన్నాం? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం అని ఒక్కసారి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఉమా మాట్లాడుతూ.. కృష్ణయ్య త్యాగాన్ని బిహార్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు.

అదే సమయంలో తమ కుటుంబానికి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో హెల్ప్ చేసిందన్నారు. నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయంతో సిన్సియర్ గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారులను నిరుత్సాహపరిచే అయ్యే అవకాశం ఉందన్నారు. రాజకీయ నాయకులు పరిమిత కాలానికే పని చేస్తారు. కానీ అధికారులు 30 ఏళ్లకు పైగా సర్వీస్ లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుందని అలాంటి అధికారులకు నితీష్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. కృష్ణయ్య మరణానికి కారకులు జీవితాంతం జైల్లో ఉంచాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News