సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నా.. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి

రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.

Update: 2024-06-11 08:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సరైన సౌకర్యాలు లేవని.. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీచర్లు లేరని గత ప్రభుత్వం పాఠశాలలను మూసేసిందని గుర్తు చేశారు. మూసేసిన పాఠశాలలను మళ్ళీ తెరుస్తామన్నారు. ఏకోపాద్యాయ స్కూళ్లను రద్దు చేయాలని సీఎం హామి ఇచ్చారన్నారు. రూ.2 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

ప్రతి పాఠశాలలో టాయిలెట్లు , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం అన్నారు. అన్ని సౌకర్యాలను కల్పించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచుతామన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా సమస్యల మీద పార్లమెంట్‌లో కొట్లాడతామన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. బడి బాట కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సీఎం రేవంత్ సూచించారని తెలిపారు. 


Similar News