రేవంత్ గుర్తుపెట్టుకో.. ఆ పనిచేస్తే ప్రజలు పాతరేస్తారు: MP ఈటల మాస్ వార్నింగ్

సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కానీ ప్రభుత్వానికి జీ హుజూర్ అన్న అధికారులకు ఏ గతి పట్టిందో

Update: 2024-07-20 15:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కానీ ప్రభుత్వానికి జీ హుజూర్ అన్న అధికారులకు ఏ గతి పట్టిందో పోలీసులు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయొచ్చని, కానీ ఐదేండ్ల తర్వాత ఓట్లు వేసేది పోలీసులు కాదని, యువకులనే విషయం రేవంత్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాకు ఈటల హాజరై మాట్లాడారు. రేవంత్‌కు అనుకూలంగా ఉన్న చానల్లో వారికి పాజిటివ్‌గా ప్రచారం చేయొచ్చని, కానీ కాంగ్రెస్ చేస్తున్న తప్పులను ప్రజలు లెక్కబెడుతున్నారన్నారు. కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటనూ నిలబెట్టుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.

ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లడుగుతారని, ఆ తర్వాత వారు కనిపించరని ఎద్దేవాచేశారు. అధికారం ఉందని, పోలీసులను నమ్ముకుని యువతను దూరం చేసుకుంటే అధోగతి పాలవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిన్నచిన్న ఉద్యోగులు పైసా పైసా కూడబెట్టి స్థలాలు కొనుక్కుని ఇండ్లు కట్టుకుంటే 35 సంవత్సరాల తర్వాత వారి ఇండ్లు కూల్చివేయడం దారుణమని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పిన రేవంత్, ఇప్పుడు పేదల ఇండ్లను అధికార మదంతో కూల్చివేస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. రేవంత్.. పైన ఉన్న బాస్ మెప్పు కోసం పని చేస్తే ప్రజలు పాతరేస్తారని రాజేందర్ హెచ్చరించారు. గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలని ఈటల డిమాండ్ చేశారు. కేసులు, లాఠీలు తమ పోరాటాన్ని ఆపలేవని రాజేందర్ పేర్కొన్నారు.


Similar News