MLC Kavitha: కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతా
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు.
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్లోని ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కవిత ఇంటివద్ద మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటతో తెలుస్తుంది.
ఆ రోజు వరకు నా పోరాటం ఆగదు. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటా. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతా అనే నమ్మకం, విశ్వాసం రెండూ నాకు ఉన్నాయి’ అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఈ కేసులో కవితకు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రే బయటకు వచ్చారు.