ఆ రంగంలో బ్యాంకర్లు సహకరించాలని కోరిన మంత్రి తుమ్మల.. నాబార్డ్ స్టేట్ పేపర్ ఆవిష్కరణ
ఆ రంగంలో అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మార్కెటింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అన్నారు. శుక్రవారం నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు. పశుపోషణ, మత్స్య పరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాబార్డ్ ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.