బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల కుప్ప చేసింది: మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. తమకు రాజకీయం చేయడం అలవాటు లేదని, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన

Update: 2024-01-10 14:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. తమకు రాజకీయం చేయడం అలవాటు లేదని, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన, తపనతో ప్రతి క్షణం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్న మార్పు తీసుకొస్తామని వెల్లడించారు. బుధవారం ఎఫ్టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని, అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు. పరిశ్రమ రంగంలోనూ మార్పు వస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చాయని, కాంగ్రెస్ పాలనలో అనేక పరిశ్రమలు ఏర్పడడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచిందని వివరించారు. బీహెచ్ఈఎల్, డీఆర్డీఎల్, డీఎల్ఆర్ఐ, మిథాని వంటి సంస్థలను స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొన్నామని, ఆ మేరకు హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ లక్షల మందికి ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామని, అందుకు పారిశ్రామిక వర్గాలు చొరువ తీసుకోవాలని కోరారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ముందుకెళ్తామని, ప్లాన్ 2050 గురించి సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రానికి, యువతకు మేలు చేయబోయే ప్రయత్నాలు అన్నీ చేస్తామని, నూరు శాతం అన్ని అమలు చేసి చూపిస్తామన్నారు. ఆరు గ్యారంటీ లు సైతం అమలు చేసి చూపిస్తామని తేల్చిచెప్పారు.

హైదరాబాద్ పారిశ్రామికంగా, ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా అభివృద్ది చెందిందని, అభివృద్ది చెందిన దేశాలు సైతం హైదరాబాద్‌ను ఫార్మా ఇండస్ట్రీ హబ్‌గా గుర్తిస్తున్నాయన్నారు. మిస్సైల్ తయారై.. ఇజ్రాయిల్‌కి ఎగుమతి అవుతోందంటే పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కావాలని కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారే కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, వాళ్లతో పాటు అనేక కంపెనీలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుందన్నారు.

కరోనాతో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా ఇబ్బందిపడ్డాయని, కానీ అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించలేకపోయాయని విమర్శించారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు మంచి తోడ్పాటు అందించేలా ముందుకు వెళ్తుందని భరోసా ఇచ్చారు. పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

చైనాకు మించి మనం కూడా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ది చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. అర్బన్ క్లస్టర్.. రీజనల్ క్లస్టర్.. సెమీ అర్బన్ క్లస్టర్.. ఇలా మూడు పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించబోతున్నామని వివరించారు. డ్రైపోర్ట్ విషయంలో కూడా త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నామని, నల్గొండతో పాటు కనెక్ట్ టూ ఓల్డ్ ముంబై హైవే ప్రాంతాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News