రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.. భట్టి

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Update: 2025-03-31 16:55 GMT
రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.. భట్టి
  • whatsapp icon

దిశ, మేడ్చల్ బ్యూరో : రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకం పై హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకై ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 5, 2025 లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలన్నారు. 50 వేల రూపాయల లోపు రుణం వంద శాతం మాఫీ, లక్ష రూపాయల లోపు రుణం 90 శాతం మాఫీ, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ. 2 లక్షల రూపాయల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుంది. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి ఎమ్మార్వో కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ గౌతం పాల్గొని మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారీగా ప్రజాపాలన కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా 15,500 పైగా ఆన్లైన్లో దరఖాస్తులు రిజిస్టర్ అయ్యాయని కలెక్టర్ తెలిపారు. మూడు రోజులు వరుస సెలవులు వచ్చినందున గడువు ముగింపు తేదీ పెంచాలని కలెక్టర్ కోరారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చామన్నారు. గ్రామీణ స్థాయిలో రాజీవ్ యువవికాసం పథకానికి ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ గౌతం కూకట్పల్లి ఎమ్మార్వో ఆఫీస్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కూకట్పల్లి ఎమ్మార్వో స్వామి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Similar News