సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లబ్ధి : మెదక్ కలెక్టర్
సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లబ్ధి

దిశ,మెదక్ ప్రతినిధి : సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం, హవేలీ ఘన్పూర్ మండలంలోని రేషన్ షాప్ లో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో లబ్దిదారులకు సజావుగా బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. స్వయంగా మీ కుటుంబంలో ఎంతమంది నివాసం ఉంటున్నారు.రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయా అని ఆరా తీశారు.
ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి నిరుపేదకు లాభం చేకూర్చే విధంగా సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అత్యధిక విలువ గల పోషకాలు, విటమిన్లు కలిగి ఉంటాయని తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ సన్న బియ్యాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో హవేలీ ఘన్పూర్ తాసిల్దార్ సింధూ రేణుక, సంబంధిత ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.