రాజీవ్ యువ వికాస్ కు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలి : భట్టి విక్రమార్క

రాజీవ్ యువ వికాస్ పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Update: 2025-03-31 15:01 GMT
రాజీవ్ యువ వికాస్ కు అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలి : భట్టి విక్రమార్క
  • whatsapp icon

దిశ, మెదక్ ప్రతినిధి: రాజీవ్ యువ వికాస్ పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాస్ పథకం పై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనుకబడిన తరగతుల యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలన్నారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాస్ పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చామన్నారు. గ్రామీణ స్థాయిలో రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ నగేష్ ఎల్ డీ ఎం నరసింహ మూర్తి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డిఓ పీడీ శ్రీనివాసరావు, సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Similar News