Red Ambulance: మరో స్కామ్ లో కేటీఆర్ పీఏ!.. తిరుపతిపై ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల సంచలన ఆరోపణలు

కేటీఆర్ పీఏ మరో స్కామ్ లో చిక్కుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-08-12 11:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ పీఏ తిరుపతిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే టీజీపీఎస్సీ పేపర్ లీక్, గొర్రెల స్కామ్ లో అతడి పాత్ర ఉందనే అనుమనాలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరుణంలో తాజాగా తిరుపతిపై తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెడ్ అంబులెన్స్ ల దోపిడీ వెనుక తిరుపతి అండదండలు ఉన్నాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్క మహేశ్ సంచలన ఆరోపణలు చేశాడు. హైదరాబాద్ నగరంలో రెడ్ అంబులెన్స్ సర్వీసుల వల్ల ప్రైవేట్ అంబులెన్స్ పై ఆధారపడి బతుకుతున్న 10 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఈ సంస్ధ ఫౌండర్& సీఈవో ప్రబ్దీప్ సింగ్ కు కేటీఆర్ పీఏ తిరుపతి అండదండలతోనే చెలరేగిపోతున్నాడని ఆరోపించారు. ప్రబ్దీప్ సింగ్ ఓ చైనా ఏజెంట్ అని అతడు హైదరాబాద్ వచ్చేందుకు సహకరించిందే గత ప్రభుత్వ పెద్దల సహకారంతో నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఈ రెడ్ అంబులెన్స్ తో అనుసంధానం చేసుకున్నాయని దాంతో ఎన్నో ఏళ్లుగా ప్రైవేట్అంబులెన్సులతో సేవలు అందించిన తమ బతుకులు ఆగం అయ్యాయని ఆరోపించారు. ఎక్కడి నుంచో వచ్చిన సంస్థకు ఇక్కడి ఆసుపత్రులు అప్పగిస్తే ఇక్కడ ఉన్న మేమంతా ఎక్కడికిపోవాలని ప్రశ్నించారు. మీకు ఓట్లు కావాలంటే తెలంగాణ వాళ్లు,హైదరాబాద్ వాళ్లు కావాలి అదే కమిషన్లు వచ్చేవి ఉంటే మాత్రం ఎక్కడి నుంచే వచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.

ముక్కుపిండి మరీ వసూలు:

రెడ్ అంబులెన్స్ కారణంగా తమకు కిరాయిలు రావడం లేదని దీంతో తాము కూడా రెడ్ అంబులెన్స్ లో చేరామన్నారు. కానీ ఆ సంస్థ ప్రతి అంబులెన్స్ కు తమ వద్ద నుంచి ఏడాదికి రూ.70 వేల నుంచి లక్షన్నర రూపాయులు డిమాండ్ చేస్తున్నదని చేరిన తర్వాత ప్రతి ట్రిప్ లో 40 శాతం కమిషన్ ను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత దోపిడీ చేసినా వారి సొంత అంబులెన్సులకు ప్రాధాన్యత ఇస్తూ తమకు చిన్న చితక గిరాకీలు మాత్రమే అప్పగిస్తున్నారని ఈ అన్యాయంపై ప్రశ్నిస్తే ఎవరికైనా చెప్పుకోండి అంటూ దబాయిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని లేకుండా చావే మాకు దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చామన్నారు. అయితే వీలైనంత వేగంగా తమకు న్యాయం జరిగేలా చూసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News