Kothagudem : గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డ ఐదుగురు యువకులు

కొత్తగూడెంలో గంజాయి తాగుతున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-08-12 23:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొత్తగూడెంలో గంజాయి తాగుతున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్‌ కాలనీకి చెందిన రావులపెంట మోహనకృష్ణ అనే చిరువ్యాపారిని ఇటీవల ద్విచక్రవాహనంపై 6.69 కిలోల గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మోహనకృష్ణ ఏపీలోని చింతూరు నుంచి గంజాయిని తెచ్చి కొత్తగూడెంలోని యువకులకు విక్రయిస్తున్నాడు.

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు వన్‌టౌన్‌ సీఐ M. కరుణాకర్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని,గంజాయి సేవిస్తున్న బెల్లంకొండ ప్రేమ్‌కుమార్‌, మహ్మద్‌ అమన్‌, షేక్‌ సాదిక్‌ పాషా, జంగిలి రేవంత్‌, కంచం సందీప్‌కుమార్‌లపై డ్రగ్‌ డోసేజ్‌ డిటెక్షన్‌ పరికరాలతో పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేశామని డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ మీడియాతో తెలిపారు. ఐదుగురు యువకులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని, జిల్లాలో గంజాయి వినియోగదారులను అరెస్టు చేయడం ఇదే తొలి ఘటన అని డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ చెప్పారు.కాగా ఇటీవలే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని గుర్తించడానికి ప్రతి జిల్లా పోలీసులకు టెస్ట్ కిట్‌లను పంపింది.


Similar News