ఆ రెండూ తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్డెస్క్: ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒకే దేశం - ఒకే ఎన్నిక (One Nation - One Election) అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నీ ఫ్రీ.. ఫ్రీ.. అంటూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు జనాల్ని ఆకట్టుకుంటున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి పథకాలు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తీసుకొచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు.
ఎన్నికల్లో గొప్పలకు పోయి.. ఉచిత పథకాలు(Free Schemes) ప్రకటిస్తున్నారు.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. పరిధికి మించి అప్పులు చేస్తే.. ఇంకొన్నాళ్లకు అప్పులు కూడా పుట్టని స్థితికి వస్తారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు చేయాలని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాల విషయం పక్కనబెడితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పాలకులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. అనవసరమైన వాటిపై కాకుండా.. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపరచడమే కాకుండా.. భవిష్యత్ గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు.
విద్య, వైద్యం(Education and Medicine) తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదని సూచించారు. తాను రాజకీయాలు విరమించి ప్రజాజీవనంలో మాత్రమే పాల్గొంటున్నా.. రాజ్యాంగంలో ఉన్నత పదవి నుంచి వచ్చాక రాజకీయాలు మాట్లాడకూడదు.. పదవీ విరమణ చేసాను కానీ పెదవి విరమణ చేయలేదు.. రాజకీయంగా కనిపించని రాజకీయ అంశాలు మాట్లాడతాను.. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అర్ధవంతమైన చర్చ జరగాలి.. వ్యతిరేకించే వారు వ్యతిరేకించినా.. ప్రజలు అంటే దేశం ఒక నిర్ణయానికి రావాలి.. పార్లమెంటు ఉభయసభలకు, అసెంబ్లీల సభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.