‘ప్రజా తీర్పే శిరోధార్యం.. అధైర్యపడొద్దు’.. కేడర్‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్

ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదు.. మనకు ప్రజా తీర్పే శిరోధార్యం.. వారు ఎటువంటి పాత్రను

Update: 2024-07-04 14:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదు.. మనకు ప్రజా తీర్పే శిరోధార్యం.. వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం ఎర్రవెల్లి ఫాం హౌజ్‌లో ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కేడర్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అధికారం కోల్పోయామని బాధపడడం సరియైన రాజకీయ నాయకుడి లక్షణం కాదన్నారు. ప్రజాసంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయం అన్నారు. దానికి గెలుపోటములతో సంబంధం ఉండదని, ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. అయినా ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన అందించిందన్నారు. విద్యుత్, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా కొనసాగిందన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు.

‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బీఆర్ఎస్‌తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని తెలిపారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటె మహారాష్ట్ర తోపాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని వివరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని కేసీఆర్ అన్నారు.

నల్ల చట్టాలను తెచ్చి తమ జీవితాలను, తాము నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఆగం చేయాలని చూసిన గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిన సంగతిని కేసీఆర్ గుర్తుచేశారు. రైతుల మీద లాఠీ ఛార్జీ కాల్పులు జరిపి ఏడువందల మంది రైతుల మరణానికి నాటి బీజేపీ సర్కార్ కారణమైందన్నారు. దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్ర నుండి ఒక లైన్ తీసుకొని ముందుకు సాగిందని కేసీఆర్ వివరించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజల అపూర్వస్పందన కానవచ్చిందన్నారు. తెలంగాణతో పాటు దేశ రైతాంగ ప్రగతికోసం బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచిందని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సాగునీరు తాగునీరు నిరంతర విద్యుత్ ఫీజు రీ అంబర్స్మెంట్ సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కూడా నేటి కాంగ్రెస్ కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతున్నదని కేసీఆర్ అవేదన వ్యక్తం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమలక్ష్యమని స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు.


Similar News