సహజ వనరుల పునరుద్ధరణ కోసమే హైడ్రా : మంత్రి శ్రీధర్ బాబు

ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోకపోతే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు.

Update: 2024-08-30 15:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోకపోతే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. నదులు, చెరువులు, వాగులు, అడవులు ప్రతీది మానవాళి మనుగడకు అవసరమైనదే అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లో జరిగిన ‘గ్రిహ పర్యావరణ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అభివృద్ధితో పాటు జీవావరణానికి అపార నష్టం జరుగుతోందని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయని తెలిపారు. వేగంగా జరుగుతున్న పర్యావరణ మార్పులను నియంత్రించేందుకు వ్యక్తిగత స్థాయిలో, ప్రభుత్వ పరంగా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచించారు. చెరువులు, వర్షపు నీటి నాలాలు, నదులను కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘హైడ్రా’ విభాగాన్ని ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోందన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్ల వరద నీటి ముంపు సమస్య తలెత్తుతోందని తెలిపారు.


రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ అత్యాధునిక టెక్నాలజీలతో కార్బన్ రహిత (జీరో కార్బన్) నగరంగా రూపొందుతుందని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించాలని మహేంద్రా యూనివర్సిటీని కోరామన్నారు. ఇది కొత్త ఉద్యోగాల సృష్టికి, స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు. బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి , సంజయ్ సేథ్, షబనా బస్సీ పాల్గొన్నారు.


Similar News