ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం గోషామహల్ లో వద్దు

గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది .

Update: 2024-09-10 14:22 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది . ఇరుకైన గల్లీలు, చిన్న రోడ్లతో ఇప్పటికే ప్రతి రోజూ ట్రాఫిక్ సమస్యలు ఎదురౌతున్నాయి. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రి ఈ ప్రాంతంలో కడితే సమస్య మరింత జఠిలంగా మారడంతో పాటు దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో పునరాలోచించాలని గోషామహల్ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

    ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం నిర్మించి వందేళ్లు దాటడంతో అది శిథిలావస్థకు చేరింది. ఇది హెరిటేజ్ జాబితాలో ఉండడంతో కూల్చివేతలకు అవరోధం ఏర్పడింది. దీంతో సుమారు నాలుగేళ్ల క్రితం నాటి సీఎం కేసీఆర్ ఈ భవనాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకోగా నేటికీ కొత్త భవనం నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో హాస్పిటల్ కు వచ్చే రోగులు, ఇక్కడ పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది ప్రతినిత్యం ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో నూతన భవనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా స్థానికంగా వ్యతిరేకతలు ఎదురౌతున్నాయి .

నూతన భవనం కావాలి- కానీ గోషామహల్ లో వద్దు....

చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం కావాలి, కానీ గోషామహల్ ఏరియాలో వద్దు, శివారు ప్రాంతంలో నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతినిత్యం హాస్పిటల్ కు వేలాది మంది రోగులు వస్తుండడం, వారి రద్ధీకి తగ్గట్లుగా ఇప్పుడున్న ఆస్పత్రి భవనాలు సరిపోకపోవడంతో నూతన భవన నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

    ఇందులో భాగంగానే గోషామహల్ పోలీస్ స్టేడియాన్ని ఖాళీ చేసి అందులో ఉస్మానియాకు నూతన భవనం నిర్మించేందుకు పరిశీలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ ఇప్పటికే సందర్శించి వెళ్లారు. అయితే ఈ ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి వద్దంటూ స్థానికులు గత కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు.

కలెక్టర్ కు వినతిపత్రం...

గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించడం ద్వారా గ్రౌండ్ ని అనుకుని ఉన్న గోషామహల్ పోలీస్ లేన్, చందన్ వాడీ, హనుమాన్ బాడా, ఆర్య సమాజ్ లేన్, మాల్ మైసమ్మ టెంపుల్, ఫీల్ ఖానా, బేగంబజార్ తదితర ప్రాంతాలలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. తాము ఉండే ఈ ప్రాంతాలు చాలా ఇరుకైన రోడ్లతో ఇప్పటికే ప్రతినిత్యం నరకం చూస్తున్నాము , ఉస్మానియా హాస్పిటల్ కట్టడం వళ్ళ మా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారుతుందని, పండుగల సందర్భాలలో చెప్పుకోలేని రీతిలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయని స్థానికులు కలెక్టర్​కు వినతిప్రతం అందించారు.

     నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని, తమ ప్రాంతంలో ప్రభుత్వం ఉస్మానియా హాస్పిటల్ కట్టడంతో భరించలేని దుర్వాసన , మెడికల్ వేస్టేజ్ విచ్చలవిడిగా పడేయడంతో శ్వాస కోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అంతేకాకుండా శవాలగది నుండి వచ్చే దుర్వాసన , వైద్యం కోసం వచ్చే రోగుల వాహనాలతో ట్రఫిక్ సమస్య ఇంకా రేటింపు అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. గోషామహల్ గ్రౌండ్ మూలంగానే ఈ రోజు తమ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ ఉందని, ఇప్పుడు అదికూడా కాంక్రీట్ గా మారుతే వాటర్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.

     తమ ప్రాంతంలో నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఉందని, హాస్పిటల్ నిర్మాణంతో ఇది కూడా సరిపోకుండా నిత్యం పొంగే ప్రమాదం ఉందని, మీరు నిర్ధేశించిన స్థలానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా సరిగా లేదని పేర్కొన్నారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీసుల అమర వీరుల స్థూపం కూడా ఉందని, ఆస్పత్రి కట్టడం మూలంగా స్థూపం ఖ్యాతి కూడా నశిస్తుందని, దీన్ని శివారు ప్రాంతంలో విశాలమైన స్థలంలో కట్టాలని వేడుకున్నారు. వినతి ఇచ్చిన వారిలో గోషామహల్ కు చెందిన అవుల వినోద్ యాదవ్ , దత్తు కోయాల్కర్, లత మాణిక్, నేహాల్ న్యాయంతబాద్, కోటి శైలాష్ కుర్మ, దుర్గ యాదవ్, వంకార్ విష్ణు, బెజిని శ్రీనివాస్, లాలాజీ సరస్వతి, వంకార్ చంద్రమోహన్, స్వరూప, మేకల సునీత, ఈశ్వర్ ఉన్నారు. 

Tags:    

Similar News