పర్మిట్ రూమ్లతో నష్టపోతున్నాం: బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు
పర్మిట్ రూమ్ల వల్ల నష్టపోతున్నామంటూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ఆందోళన నిర్వహించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: పర్మిట్ రూమ్ల వల్ల నష్టపోతున్నామని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. బార్ల ఆదాయం తగ్గిపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం జరుగుతుందని బార్ యజమానులు చెప్పుకొచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బార్ యజమానులు డిమాండ్ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా అసోషియేషన్ సభ్యులు ఆబ్కారీ శాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. బార్ల చుట్టూ ఉన్న వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లు ఉండటం వల్ల ల్ల బార్ల వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని వెల్లడించారు. గ్రామాలు, బస్తీల్లో బెల్ట్ షాపుల సంఖ్య పెరగడం వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జిల్లాల్లో వైన్ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తుండగా, హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 గంటల వరకు అనుమతించడంపై అసోసియేషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ రాత్రి 10గంటలకు అనుమతించాలన్నారు. అడిషనల్ కమిషనర్ను కలిసి తమ సమస్యలు విన్నవించినట్లు తెలిపారు. ఎక్సయిజ్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళాతామని తెలిపారు.