Etala Rajender: పేదల ఇండ్లు కూలగొడితే జైలుకెళ్లడం ఖాయం: ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

పార్టీలు అధికారంలో ఐదేళ్లు ఉండి పోతాయని.. అధికారులు మాత్రం 35 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు.

Update: 2024-09-27 07:35 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: పార్టీలు అధికారంలో ఐదేళ్లు ఉండి పోతాయని.. అధికారులు మాత్రం 35 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. శుక్రవారం ఆయన కొత్తపేట, సత్యానగర్, ఫణిగిరి కాలనీ, జనప్రియ అపార్ట్‌మెంట్స్, తదితర ప్రాంతాల్లో పర్యటించి మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లు కోల్పోతున్న వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారు ఆదేశాలు విని ప్రజలను, చట్టాలను పట్టించుకోకుండా పేదల ఇండ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయమని అన్నారు. చిల్లరగాళ్లు, సైకోలు తన గురించి మాట్లాడితే బాధపడనని, పేదల జోలికి వస్తే ఊరుకోనని హెచ్చరించారు. ఎక్కడ కోర్టుకు వెళ్తామోనని దొంగల్లాగా శని, ఆదివారాల్లో ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే మూసీని తోడి లోతు పెంచాలని.. భూ సంరక్షణకు గోడ కట్టాలని సూచించారు.

నంగరలో అన్ని చెరువులు డ్రైనేజీ వాటర్‌తో కలుషితం అయ్యాయని తెలిపారు. కొబ్బరి నీళ్ల లెక్క హుస్సేన్ సాగర్‌ను చేస్తానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ పాలన పదేళ్ల పాటు ఏం చేయకుండా ముగిసిందిని అన్నారు. మాటలు చేప్పండం సులభమే కానీ.. చేతల్లో చేయడమే కష్టమని అన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని, పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వం అనుమతులతోనే అంతా ఇండ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. ఇవాళ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అంటూ ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చివేడయం దారుణమని అన్నారు. సర్కార్ తమ జాగీరు లాగా పోలీసులతో వచ్చి బెదరించి ఇండ్లపై మార్కింగ్ చేయండ ఏంటని ప్రశ్నించారు. ముందు ప్రభుత్వం తమతో ఎక్కడా ఇండ్లు కూలగొట్టడం లేదని వారి జోలికి పోవడట్లేదని చెప్పిందని.. తీరా చూస్తే చెప్పిన మాటకు, చేస్తున్న పనికి పొంతన లేదన్నారు.

నలభై, యాబై ఏళ్ల క్రితమే ఆ ఇండ్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, రెక్కలు ముక్కలు చేసుకుని పేదలు ఆ ఇళ్లను కట్టుకున్నారని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదన.. ప్రభుత్వం పేదలతో గోక్కోవద్దని హితవు పలికారు. హైడ్రా పేరిట జరుగుతున్న డ్రామాను ఆపాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి విలువ లేదని, చివరకు పేదలంటే గౌరవం లేదని మండిపడ్డారు. గతంలో తాను అనేక మంది సీఎంలను, ప్రభుత్వాలను చూశానని.. అప్పట్లో కనీసం పోయి సమస్య చెబితే వినే పద్ధతి ఉండేదని అన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని.. అందరికీ అండగా తాను ఉంటానని ఈటల హామీ ఇచ్చారు. 


Similar News