బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష.. రైతులకు మహేశ్వర్ రెడ్డి కీలక విజ్ఞప్తి

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ...

Update: 2024-09-29 16:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర రైతు దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందని ఏలేటి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పెద్ద ఎత్తున వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసం అమలుకాని హామీలిచ్చి అన్ని వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో దీక్ష చేస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. మోసపూరితమైన మాటలతో రాష్ట్రంలో అరాచకమైన పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరావాలన్నారు. రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతీ రైతు కదిలిరావాలని మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తిచేశారు.


Similar News