HYD : అనుమానంతో భార్య గొంతుకోసిన భర్త.. ఎక్కడంటే..?

అనుమానం పెను భూతంగా మారడంతో విచక్షణ కోల్పోయిన భర్త కట్టుకున్న భార్యను దారుణంగా గొంతుకోసి హత్యకు యత్నించిన ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-06-06 07:19 GMT

దిశ, శేరిలింగంపల్లి : అనుమానం పెను భూతంగా మారడంతో విచక్షణ కోల్పోయిన భర్త కట్టుకున్న భార్యను దారుణంగా గొంతుకోసి హత్యకు యత్నించిన ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న తులసి (45 ) భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో కలిసి స్థానికంగా కర్రీ పాయింట్ నడుపుతుంది. చాలాకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వేరు వేరుగా ఉంటున్నారు. గతంలో తులసిపై అనుమానంతో ఆమె భర్త జగన్నాథం గొడవలు పడేవాడు.

పలుమార్లు ఇరువురికి పెద్దలు నచ్చచెప్పినా వీరి మధ్య సయోధ్య కుదరలేదు. భార్యపై అనుమానంతో రగలిపోతున్న జగన్నాథం బుధవారం రాత్రి ఆమె ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె గొంతుకోసి పారిపోయాడు. బాధితురాలి అరుపులతో అక్కడికి చేరుకున్న స్థానికులు తీవ్రరక్త స్రావంతో బాధపడుతున్న బాధితురాలిని నలగండ్లలోని సిటిజెన్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలికి చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News