ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

రాష్ట్రంలో టీజీఆర్టీసీ యాజమాన్యం వెయ్యి కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఈ బస్సులు దశల వారీగా వివిధ రూట్లలో బస్సులు

Update: 2024-07-31 03:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీజీఆర్టీసీ యాజమాన్యం వెయ్యి కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఈ బస్సులు దశల వారీగా వివిధ రూట్లలో బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను, 13 చార్జింగ్ స్టేషన్లను సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) విధానంలో నడవనున్నాయి. 1000 బస్సుల్లో 500 హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ, హయత్‌నగర్ వంటి డిపోల పరిధిలోని డీజీల్ బస్సుల స్థానంలో నడపనున్నారు.

ఈ డీజిల్ బస్సులను గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు. మిగతా 500 ఎలక్ట్రిక్ బస్సులను సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అధిక ట్రాఫిక్ రూట్లలో నడపనున్నారు. ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ ఎయిర్ పోర్ట్ రూట్లలో 49 పుష్పక్ బస్సులు, విజయవాడ, హైదరాబాద్ మధ్య 10 ఎలక్ట్రానిక్ బస్సులతో సహా మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.

13 చార్జింగ్ స్టేషన్లు

ఎలక్ట్రిక్ బస్సులకు రీఛార్జ్ చేసుకునేందుకు అనుగుణంగా పలు డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2, నిజామాబాద్ సహా పలు డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టేషన్‌లో 20 నుంచి 25 చార్జింగ్ గన్‌లు ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ బస్సులు ఒకే సమయంలో చార్జ్ చేసుకోవచ్చు.


Similar News