ఉపాధ్యాయుల దినోత్సవం నాడు.. టీచర్లు కావాలని విద్యార్థుల ఆందోళన

గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో అన్ని తరగతులకు అధ్యాపకులను నియమించాలని గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

Update: 2024-09-05 06:19 GMT

దిశ, శేరిలింగంపల్లి: గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో అన్ని తరగతులకు అధ్యాపకులను నియమించాలని గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ, గురుకుల సొసైటీ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి యేటా ఇందులో చదువుకునే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో సరైన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల సిలబస్ ముందుకు సాగడం లేదు. గత ఏడాది ఆయా సెక్షన్లకు కలిపి 31 మంది అధ్యాపకులు ఉండగా, ఈసారి కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. 18 మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు వెంటనే అధ్యాపకులను నియమించి సిలబస్ పూర్తి అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గౌలిదొడ్డి గురుకుల పాఠశాల ఎదుట బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అధ్యాపకులను నియమించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.


Similar News