మల్కాజిగిరి చరిత్రలో ఫస్ట్ టైం.. ఈటల రికార్డులివే..!
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రికార్డు సృష్టించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రికార్డు సృష్టించారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో 2009 లోక్సభ ఎన్నికల నుంచి ఉనికిలోకి వచ్చిన ఈ నియోజకవర్గంలో మొదటి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ (2009 ఎలక్షన్స్) 91,326 ఓట్ల మార్జిన్తో సమీప ప్రత్యర్థి టి.భీమ్సేన్ (తెలుగుదేశం)పై గెలుపొందగా ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి 28,166 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి 10,919 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డిపై గెలుపొందారు.
టీ బీజేపీ విజేతల్లో టాపర్
ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఈటల రాజేందర్ (బీజేపీ) తన సమీప ప్రత్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డి (కాంగ్రెస్)పై ఏకంగా 3,91,475 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో ఇంత పెద్ద మార్జిన్తో గెలుపొందడం ఇదే ఫస్ట్ టైమ్. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ పొందిన అభ్యర్థుల్లో ఈటల రాజేందర్ మూడో స్థానంలో నిలవగా రాష్ట్ర బీజేపీ అభ్యర్థుల్లో ఆయనే టాపర్ కావడం విశేషం. అత్యధిక మెజార్టీల్లో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్రెడ్డి (5,59,906 ఓట్లు) ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి (4,62,011) ఉన్నారు. కాగా 3,91,475 ఓట్ల మెజార్టీతో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ థర్డ్ ప్లేస్లో నిలిచి సత్తా చాటారు.
2024 ఎన్నికలు
మొత్తం ఓటర్లు : 37,79,596
పోలైన ఓట్లు : 19,19,131
పోలింగ్ పర్సంటేజీ : 50.78%
విన్నర్ : ఈటల రాజేందర్ (బీజేపీ)
పొందిన ఓట్లు : 9,91,042
ప్రత్యర్థి : పట్నం సునీతా మహేందర్రెడ్డి (కాంగ్రెస్)
పొందిన ఓట్లు : 5,99,567
మార్జిన్ : 3,91,475