లెక్కలు తెలియకుండా తిక్క మాటలొద్దు బండి సంజయ్.. టీపీసీసీ నేత సంచలన వ్యాఖ్యలు
లెక్కలు తెలుసుకోకుండా తిక్క తిక్క మాటలొద్దు బండి సంజయ్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ (TPCC General Secretary Charan Koushik Yadav) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: లెక్కలు తెలుసుకోకుండా తిక్క తిక్క మాటలొద్దు బండి సంజయ్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ (TPCC General Secretary Charan Koushik Yadav) అన్నారు. రేషన్ కార్డుల (Ration Cards)పై మోడీ ఫోటో పెట్టాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. కేంద్రమంత్రిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister bandi Sanjay) రేషన్ కార్డులలో ప్రధాని మోడీ (PM Narendra Modi) ఫోటో పెట్టాలని ప్రతీసారి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే.. కేంద్రం కేవలం 54 లక్షల రేషన్ కార్డులకు 51 శాతం మాత్రమే బరిస్తుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) 54 లక్షల రేషన్ కార్డులకు 49 శాతంతో పాటు మరో 34 లక్షల రేషన్ కార్డులకు బరిస్తోందని తెలిపారు. అంతేగాక కేంద్రం కేవలం 5 కేజీలు మాత్రమే ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 6 కేజీలు ఇస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం మూలంగా ప్రభుత్వంపై 2,855 కోట్లు అదనపు భారం పడుతోందని వివరించారు.
సన్న బియ్యం కోసం ప్రతీ నెలా దాదాపు 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెడుతోందని, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం 8 వేల కోట్ల పైచిలుకు ఖర్చు పెడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,425 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతోందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మరింత భారం పడనుందని అన్నారు. బండి సంజయ్ ప్రధాని మోడీతో మాట్లాడి తెలంగాణకు అదనపు రేషన్ కార్డులు ఇప్పించాల్సింది పోయి రేషన్ కార్డులలో మోడీ ఫోటో పెట్టడం లేదని రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ నేత వ్యాఖ్యానించారు.