22 ఏళ్ల తర్వాత సీబీ‘ఐ’కి చిక్కిన నిందితుడు.. 3 వేషాలు మార్చి ఎలా తప్పించుకున్నాడో తెలుసా..?

రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం సీబీఐ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు.

Update: 2024-08-06 02:36 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం సీబీఐ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని చందులాల్ బిరాదారి ఎస్‌బీఐ బ్రాంచి‌లో రూ.50 లక్షల వరకు మోసానికి పాల్పడి 22 ఏండ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడిని తమిళనాడులో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. ఏండ్లుగా నిందితుడు వేషాలు, పేర్లు మార్చుకున్నా సీబీఐ అతడిని వెంటాడి పట్టుకోవడంతో ఈ కేసు ఆసక్తిని రేపింది.

తప్పుడు కొటేషన్లతో మోసం..

హైదరాబాద్‌కు చెందిన వి.చలపతిరావు 2002 మే నెలలో చందులాల్ బిరాదరి బ్రాంచి‌లో ఫేక్ శాలరీ సర్టిఫికెట్లు, ఎలక్ట్రానిక్ షాప్‌లకు సంబంధించిన తప్పుడు కొటేషన్లను ఇచ్చి ఎస్‌బీఐను రూ.50 లక్షల వరకు మోసం చేశాడు. దీనిపై సీబీఐ మే1వ తేదీన కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తులో భాగంగా 2004లో రెండు చార్జ్‌షీట్‌లను కోర్టులో దాఖలు చేసింది. అప్పటి నుంచి చలపతి‌రావు అదృశ్యమయ్యారు.

చనిపోయినట్టు ప్రకటించాలని కోర్టులో పిటిషన్..

ఈ క్రమంలోనే నిందితుడు చలపతిరావు భార్య, తన భర్త అదృశ్యమైనట్టు కామాటిపుర పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. 7 ఏండ్ల నుంచి తన భర్త కనిపించడం లేదని, అతను చనిపోయినట్టు పరిగణించాలని సివిల్ కోర్టు‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు డిక్రీ ఇచ్చింది. చలపతిరావు ఆస్తులను జప్తు చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని భార్య హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చింది. ఆ తర్వాత సీబీఐ సీఆర్పీసీ సెక్షన్ 82, 83 కింద చలపతిరావును నేరస్థుడిగా ప్రకటించింది. 3 అవతారాలు, 10 ఫోన్ నంబర్లు

హైదరాబాద్ నుంచి పారిపోయిన చలపతిరావు సాలెం ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ 2007లో వినీత్ కుమార్‌గా పేరు మార్చుకుని ఆధార్ కార్డు పొంది అక్కడి యువతిని వివాహం చేసుకున్నాడు. 2014లో సాలెం నుంచి భోపాల్‌కు వచ్చాడు. అక్కడ కొన్ని రోజుల పాటు లోన్స్ రికవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ రుద్రాపూర్‌కు వెళ్లి ఓ స్కూల్‌లో పనిచేశాడు. ఆ సమాచారం తెలుసుకుని సీబీఐ అక్కడికి చేరుకునే సరికి నిందితుడు 2016లో రుద్రాపూర్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది.

దీంతో సీబీఐ అప్పటివరకు చలపతిరావు వాడిన ఈ-మెయిల్ ఐడీలు, ఆధార్ కార్డు ఆధారంగా ఔరంగాబాద్‌లోని వేరుల్ గ్రామంలో 2016-2021 వరకు ఓ ఆశ్రమంలో స్వామి విధితత్మానంద్ తీర్త్‌గా చెలామణి అయినట్టు గుర్తించింది. ఆశ్రమంలో రూ.70 లక్షలు మోసం చేసి నిందితుడు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చేరుకున్నాడు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి..ఇటీవల తమిళనాడు తిరుణవెల్లి‌కి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి శ్రీలంకకు సముద్ర మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సీబీఐ ఆఫీసర్లు అతడిని అరెస్ట్ చేశారు. ఏండ్ల సస్పెన్స్‌కు తెరదించారు. ఈ 20 ఏండ్ల కాలంలో నిందితుడు 10 ఫోన్ నంబర్లు మార్చినా సీబీఐ ఆఫీసర్లు అతడిని వదిలిపెట్టలేదు.


Similar News