భవిష్యత్తులో అవన్నీ టూరిజం కేంద్రాలే: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక భవనాలన్నింటినీ ప్రభుత్వం పరిరక్షిస్తుందని, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతుందని, నగర సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కోసం ముందుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Update: 2024-09-27 17:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక భవనాలన్నింటినీ ప్రభుత్వం పరిరక్షిస్తుందని, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతుందని, నగర సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కోసం ముందుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్నీ అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వానికి పరిశ్రమల అధిపతులు తగిన సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని వివరించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కౌన్సిల్ కార్యకలాపాలు జరిగిన పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి వెల్ల‌డించారు. ప్రస్తుతం శాసనమండలిగా కొనసాగుతున్న జూబ్లీ హాల్‌కు చారిత్ర‌క ప్రాధాన్యత ఉన్నదని, ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనం నిర్మాణమైందని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరమున్నదన్నారు. జూబ్లీహాల్‌ను దత్తత తీసుకొని పరిరక్షించాల్సిందిగా సీఐఐ ప్రతినిధులకు సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న హైకోర్టును రాజేంద్రనగర్‌లో నూతన భవనాన్ని నిర్మించి దానిలోకి షిప్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు గుర్తుచేశారు.

ఇప్పుడున్న హైకోర్టు భవనాన్ని హెరిటేజ్ స్ట్రక్చర్‌గా గుర్తించి రక్షించాల్సిన అవసరముందని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురానాపూల్ బ్రిడ్జి లాంటి పలు చారిత్రక కట్టడాలను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసర‌ముందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతూ ఉన్నదని గుర్తుచేశారు.

మెట్ల బావులు దత్తతకు ఒప్పందాలు :

నగరంలోని పలు పురాతన మెట్ల బావు లను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే సంతకాలు జరిగాయి. ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్పోసిస్ సంస్థ ఒప్పందం చేసుకోగా మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ అనే సంస్థ దత్తత తీసుకున్నది. సాలార్‌జంగ్, అమ్మపల్లి బావుల‌ను భారత్ బయోటెక్ సంస్థ దత్తత తీసుకుని పునరుద్దరించనున్నది. అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని తెలంగాణ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నది.

‘తెలంగాణ దర్శిని’తో విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ :

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలో పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ఉచితంగానే సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామ‌ని, దానికి సంబంధించిన జీవోను ఇప్పటికే జారీ చేశామని గుర్తుచేశారు. చారిత్ర‌క‌, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రోగ్రామ్ చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్‌టమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News