CM Revanth Reddy: రేషన్ కోటా పెంచండి! కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి
కొత్త రేషన్ కార్డుల జారీ వేళ కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన కోటా పెంచాలని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇవాళ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో (Uttam Kumar Reddy) కలిసి కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో (Prahlad Joshi) భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన చర్చల్లో 2014-15 గాను సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PM Garib Kalyan Yojana) కింద సరఫరా చేసిన బియ్యం బకాయిలు (Dues) రూ. 343.27 కోట్లు విడుదల చేయడంతోపాటు సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కోరారు. అయితే ఈ సమామావేశం పూర్తి స్థాయిలో జరగలేదు. ప్రహ్లాద్ జోషికి మరో అపాయింట్మెంట్ ఉండటంతో ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకో మరోసారి కేంద్రమంత్రితో సీఎం భేటీ కానున్నారు.
కొత్త రేషన్కార్డులపై డిస్కషన్..
రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) జారీ ప్రక్రియ జరగలేదు. ఈ క్రమంలోనే కార్డుల జారీకి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగియనుండటంతో దీనిపై ముందడుగు వేయాలని భావిస్తోంది. ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కోటా పెంచాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.