CM Revanth Reddy: రుణమాఫీకి ప్రమాణికం అదే.. మరోసారి క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

రైతు రుణమాఫీ కార్యక్రమానికి ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టింది.

Update: 2024-07-18 12:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ కార్యక్రమానికి ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో నిర్వహించిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన రైతులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొత్తం మూడు దశల్లో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని అన్నారు. తొలి విడతలో భాగంగా రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. ఈ మేరుకు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదును జమ చేశామని వెల్లడించారు.

ఈ నెలాఖరు నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాల మాఫీ చేస్తామని అన్నారు. రెండో విడతలో రుణమాఫీకి రూ.8 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆగస్టు 15 లోపు నగదు జమ చేస్తామని, అందుకు రూ.15 వేల కోట్ల నిధులు అవసరమని తెలిపారు. పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని, కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్టు ప్రమాణికమని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్టులు లేనట్లుగా గుర్తించామని తెలిపారు.

Tags:    

Similar News