ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం.. కొత్త పీసీసీపై జోరుగా చర్చ

టీకాంగ్రెస్ లో కొత్త పీసీసీపై జోరుగా చర్చ జరుగుతోంది.

Update: 2024-06-07 13:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడు ఎంపిక వంటి అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టు భర్తీ, పీసీసీ చీఫ్ మార్పులు ఉంటాయని కొంత కాలంగా టీకాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశాల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మెరుగుపడిన నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పీసీసీ పోస్టులో రేవంత్ రెడ్డినే కొనసాగిస్తారా ముఖ్యమంత్రిగా పరిపాలన భారం రేవంత్ పై పెట్టి పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఒక వేళ వేరే వారికి పీసీసీగా నియమిస్తే ఈ పోస్టుకు తన వారసుడిగా రేవంత్ రెడ్డి ఎవరి పేరును సూచిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక రేపు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, టీ కాంగ్రెస్ నేతలు వంశీచంద్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఈ ఏడాది జరగబోయే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత మార్పులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News