బీఆర్ఎస్ ఎమ్మెల్యే బ్యాంకు లాకర్లలో బినామీల పేరుతో డాక్యుమెంట్లు.. ఈడీ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు!

మహిపాల్ రెడ్డి పై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.

Update: 2024-07-03 13:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ఈడీ కేసు విచారణ ముమ్మరం చేసింది. నిన్న మహిపాల్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు బుధవారం మహిపాల్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లపై ఫోకస్ పెట్టారు. పటాన్ చెరులోని యాక్సిస్ బ్యాంక్ లో మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లను ఈడీ అధికారులు ఓపెన్ చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బినామీల పేర్లతో ఉన్న పలు పత్రాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.. మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిపాల్ రెడ్డికి బినామీలుగా ఉన్నవారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం.

కాగా గత నెల 20న మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు రావాల్సిందిగా ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా ఆ మరుసటి రోజే బ్యాంకు లావాదేవీలు, లాకర్లపై ఈడీ ఫోకస్ పెట్టడం సంచలనంగా మారింది. అయితే పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్ల వరకు నష్టం వాటిల్లేలా చేశారనే ఆరోపణలు వీరిపై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ దూకుడు పెంచడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News