అమిత్ షాతో బండి సంజయ్ ప్రత్యేక భేటీ.. కారణం ఏంటి..?

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో

Update: 2023-09-17 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శనివారం రాత్రి నగరానికి వచ్చిన అమిత్ షాను సంజయ్ కలిశారు. అయితే ఆదివారం మరోసారి అమిత్ షాను కలవడం కీలకంగా మారింది. వరసగా రెండు రోజులు పాటు అమిత్ షాతో బండి భేటీ కావడం బీజేపీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ సమావేశం జరగలేదు. కేవలం బండి సంజయ్‌ను మాత్రం అమిత్ షా కలిశారు. ఇటీవల ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రజల, పార్టీ నేతల అభిప్రాయాలు తెలసుకుని హైకమాండ్‌కు ఒక నివేదిక పంపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ షాను బండి సంజయ్ తరచుగా కలుస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది. 

అయితే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అమిత్ షాకు రాష్ట్ర ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు.

Tags:    

Similar News