జగన్ తీరు హిందుత్వంపై దాడే.. డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి?: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

తిరుపతి డిక్లరేషన్ వ్యవహారంపై కరీంనగర్ ఎంపీ బండీ సంజయ్ (MP Bandi Sanjay) స్పందించారు.

Update: 2024-09-28 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి డిక్లరేషన్ వ్యవహారంపై కరీంనగర్ ఎంపీ బండీ సంజయ్ (MP Bandi Sanjay) స్పందించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (JaganMohan Reddy) తిరుమల డిక్లరేషన్‌పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్తులు హిందూ ఆలయాల్లోకి ప్రవేశిస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలెన్నో ఉన్నాయని, డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. నిజానికి దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని, కానీ ప్రస్తుతం దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో శ్రీ విద్యారణ్య నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాలనలో ఎంత మంది దళితులకు తిరుమలలో అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనలు ఎప్పటి నుండో ఉంది. కొత్తగా పెట్టిన నిబంధన కాదు. అట్లాంటి తిరుమలకు క్రిస్టియన్ అయిన జగన్ వెళుతున్నప్పడు డిక్లరేషన్ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి? డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకునేందుకు డిక్లరేషన్ సమర్పించారు. జగన్ అంతకంటే ఎక్కువా? దీనిపై రాజకీయాలెందుకు? ఇవ్వకుంటే దేవుడిపై విశ్వాసం లేనట్లే. గతంలో జగన్ హిందువుల ఓట్ల కోసమే తిరుమల వెళ్లినట్లు అన్పిస్తోంది. డిక్లరేషన్ అడిగినందుకు ఇదేం హిందుత్వం అని అంటున్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ తిరుమలలో కులాలు చూడరు. జగన్ పాలనలో కూడా ఎంతో మంది దళితులు తిరుమల దర్శనం చేసుకున్నారు. అసలు తిరుమల గురించి మాట్లాడే అర్హత జగన్‌కి లేదు. జగన్ పాలనలో శేషాచలం కొండలల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ 7 కొండలను 2 కొండలకే పరిమితం చేసే కుట్ర చేస్తే... బీజేపీ (BJP), వీహెచ్‌పీ (VHP) వంటి సంస్థలే అడ్డుకున్నాయి.

తిరుమలకు వచ్చేసరికి ఇట్లా మాట్లాడుతున్నారు కదా? మరి బొట్టు పెట్టుకుని టోపీ పెట్టుకోకుండా నమాజ్ చేయబోమని మక్కా మసీదుకు హిందువులు వెళితే అనుమతిస్తారా? ప్రార్థనలు చేయకుండా వాటికన్ సిటీ, జెరూసలెంకు హిందువులు వెళతానంటే ఒప్పుకుంటారా? తిరుమల విషయంలోనే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు. జగన్ తీరును చూస్తుంటే టీటీడీ లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ చేసినట్లు అనిపిస్తోంది. ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉంది.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News