సబ్బండ వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

సబ్బండ వర్గాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

Update: 2024-09-17 11:19 GMT

దిశ, ఉట్నూర్ : సబ్బండ వర్గాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ అధికారి ఖుష్బు గుప్తాతో కలిసి ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా కానీ తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతం నిజాం కబంధహస్తాల్లో ఉండేదని, అప్పటి ప్రభుత్వం నిజాం సైన్యంతో పోరాడి హైదరాబాద్​ను దేశంలో విలీనం చేసిందని పేర్కొన్నారు.

     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని ప్రజా పాలన దినోత్సవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం మళ్లీ మొదలవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సాంకేతిక లోపాలతో రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి పాటుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.

     అనంతరం పాత ఉట్నూర్ లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను స్వర్ణకార - విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కుల, చేతి వృత్తులను కాపాడుకుంటూ కాలనీకి అనుగుణంగా మారాలన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News