ఆదిలాబాద్‌కు వచ్చిన హైడ్రా.. ఆందోళనలో స్థానిక ప్రజలు

హైదరాబాద్ లో చెరువుల రక్షణ కోసం ప్రారంభమైన హైడ్రా ఆదిలాబాద్

Update: 2024-09-27 14:56 GMT

దిశ,ఆదిలాబాద్ : హైదరాబాద్ లో చెరువుల రక్షణ కోసం ప్రారంభమైన హైడ్రా ఆదిలాబాద్ కు వచ్చింది. ఈ మేరకు రెండు రోజులుగా ఖానాపూర్ చెరువులో ఆక్రములను గుర్తిస్తూ అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు. దీని కోసం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఒక కమిటీ వేశారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఖానాపూర్ సరిహద్దులను గుర్తించేందుకు సర్వే చేయాలని సూచించారు. దీంతో రెండో రోజు శుక్రవారం ఖానాపూర్ ,అంబేద్కర్ నగర్ కాలనీల మధ్యలో సర్వే కొనసాగించారు. ఇండ్లు కూలుస్తారంటూ కాలనీవాసులు పలువురు వారి సర్వేను అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు చేయించుకోమని స్పష్టం చేశారు.

కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూలిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. అంతకుముందు అధికారులు ఇండ్ల వారి వద్దకు వెళ్లి వారి పేర్లు, రేషన్ కార్డు, నిర్మాణ ఏరియా, ఎప్పటి నుంచి ఉంటున్నారనే తదితర వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈ ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ.. మ్యాప్ ప్రకారం ఖానాపూర్ చెరువు ఒక 144 ఎకరాల 30 గుంటలు ఉందన్నారు. ఖానాపూర్ ఎంపీటీలోని ఎఫ్ టీ ఎల్ సరిహద్దులో అక్రమమైన నిర్మాణాలు జరిగాయని, వాటి గురించి తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక టీమును ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ప్రాంతాల్లో పర్యటించి కొలతలను తీసుకుని కలెక్టర్ కు అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మురుగునీరును శుద్ధి చేసే కేంద్ర ప్రభుత్వ ఎంబీటీ రానుందని అందుకే ముందస్తుగా అన్ని సర్వేలు చేసి, నివేదికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.


Similar News