Breking: భద్రాచలంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది..

దిశ బ్యూరో, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలంలోని రామాలయానికి అతి సమీపంలో ఉన్న వీధిలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనం కూలి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో నలుగురు శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అర్చకత్వం చేసుకునే ఓ వ్యక్తి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. శిథిలాలు తొలగిస్తేనే కానీ ప్రమాద తీవ్రతను చెప్పలేమన్న అధికారులు.. తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధిలో అతితక్కువ స్థలంలో ఆరు అంతస్తుల భవనం నాసిరకంగా నిర్మించడమే కారణంగా తెలుస్తుంది.
గతంలోనూ ఫిర్యాదులు..
నాసిరకంగా, పిట్టగోడలతో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని గతంలోనే గ్రామపంచాయతీ అధికారులకు స్థానికులు అనేక ఫిర్యాదులు చేశారు. అనేకసార్లు ఆందోళనకు కూడా దిగారు. చర్యలు తీసుకుంటామన్న అధికారులు అటువైపు కన్నేత్తి చూడకపోవడం, మామూళ్లకు అలవాటు పడి జరుగుతున్న నిర్మాణాలను పట్టించుకోక పోవడం కారణంగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణాలు లేవని తెలిసినా అక్రమార్కులు భద్రాచలంలో యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉండగా ఆరు అంతస్థులు ఎలా నిర్మిస్తున్నారని, అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఐటీడీఏ స్థాయి అధికారి ఉన్నా..
భద్రాచలంలో ఐటీడీఏ స్థాయి అధికారి, ఆర్డీఓ, ఎమ్మార్వో ఉన్నా ఈ అక్రమ కట్టడంపై ఫిర్యాదులు అందినా ఏ ఒక్కరూ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంత పెద్ద ఉపద్రవం వచ్చిపడినట్లు తెలుస్తుంది. భద్రాద్రి రామాలయానికి భక్తులు ఎక్కవగా వస్తున్న దృష్ట్యా ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు భారీగా పెరిగాయి. నిర్మాణ పనులు ఎలా ఉన్నా.. అనుమతులు లేకుండా, ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్మించిన, నిర్మిస్తున్నభవనాలే ఎక్కువ. వివిధ సంఘాల నాయకులు కొందరు స్థానికులతో కలిసి అక్రమ భవనాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు కూలిన భవనంపై కూడా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే కూలిన శిథిలాల కింద ఎంత మంది ఉన్నారన్న విషయం స్పష్టం కావడంలేదు.