Infosys Layoffs: మరోసారి ట్రైనీలపై ఇన్ఫోసిస్ వేటు.. ఈసారి ఎంతమంది అంటే?
2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: 2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో జాబ్లోంచి ఎప్పుడూ తీసేస్తారో అనే తెలియని కష్టకాలం ఐటీ ఉద్యోగుల్లో నెలకొంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అదే బాటలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కూడా ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగిస్తోంది. ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్ (Mysuru Campus)లో శిక్షణ పొందుతున్న వందలాది మంది ట్రైనీలను తొలగించిన సంస్థ తాజాగా మరింతమంది ట్రైనీలపై వేటు వేసింది.
ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్లో ఉత్తీర్ణత సాధించని కారణంగా 195 మందిని ట్రైనీలను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అయితే, ఈ ఏడాదిలో ట్రైనీలను తొలగింపు చేపట్టడం వరుసగా ఇది నాలుగోసారి కావటం గమనార్హం. పరీక్షలో ఫెయిల్ అయిన ట్రైనీలకు ఇ-మెయిల్ ద్వారా ఇన్ఫోసిస్ సమాచారం ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇక తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్గ్రేషియాతో పాటు రిలీవింగ్ లెటర్ను కూడా ఇస్తోంది.
ఇన్ఫోసిస్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 800 మందిని ట్రైనీలను తొలగించింది. తొలుత ఫిబ్రవరి నెలలో 300 మంది ట్రైనీలను తొలగించింది. మార్చిలో 30-35 మందిని, ఏప్రిల్లో 240 మందిని తొలగించింది. తాజాగా ఇది నాలుగోసారి. ప్రస్తుతం తొలగించిన ట్రైనీలు 2022లో ఇన్ఫోసిస్ నియమించుకుంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 15 వేల మంది ట్రైనీలను నియమించుకుంది.