థాయిలాండ్ ఓపెన్ టైటిల్కు అడుగు దూరంలో సాత్విక్ జోడీ
థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్కు భారత జంట సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి అడుగు దూరంలో నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్కు భారత జంట సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి అడుగు దూరంలో నిలిచింది. తొలి రౌండ్ నుంచి దూకుడుగా ఆడుతున్న ఈ జంట సెమీస్లోనూ అదే జోరు కనబర్చి ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్లో సాత్విక్ జోడీ 21-11, 21-12 తేడాతో చైనాకు చెందిన మింగ్ చె లు-టాంగ్ కై వీపై విజయం సాధించింది.
రెండు గేముల్లోనూ భారత ఆటగాళ్లు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించారంటే వారి దూకుడు ఆటతీరును అర్థం చేసుకోవచ్చు. ఈ జోడీ ఫైనల్కు చేరి రెండో థాయిలాండ్ ఓపెన్ టైటిల్పై కన్నేసింది. తొలిసారి 2019లో విజేతగా నిలిచింది. ఈ సీజన్లో ఈ జోడీకి ఇది నాలుగో ఫైనల్ కావడం గమనార్హం. నేడు ఫైనల్ మ్యాచ్లో చెన్ బో యాంగ్-లియు యు(చైనా)తో సాత్విక్ జంట తలపడనుంది. మరోవైపు, మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో పోరాటం ముగిసింది. సెమీస్లో ఈ జంట 12-21, 20-22 తేడాతో టాప్ సీడ్ కిటితారాకుల్-రవింద ప్రజోంగ్జాయ్(థాయిలాండ్) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్ను సులభంగానే సమర్పించుకున్నా.. రెండో గేమ్లో తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు.