ధోనీ గురించి బీసీసీఐని అడగలేదు.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో కాశీవిశ్వనాథన్

ఐపీఎల్ వేలంలో బీసీసీఐ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రూల్‌ను తిరిగి తీసుకరావాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయి.

Update: 2024-08-17 19:34 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో బీసీసీఐ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రూల్‌ను తిరిగి తీసుకరావాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ధోనీని అన్‌క్యాప్‌డ్ ఆటగాడికి వేలంలోకి అనుమతించాలని చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) బీసీసీఐని కోరినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలను సీఎస్కే సీఈవో కాశీవిశ్వనాథన్ ఖండించారు. ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకొచ్చేందుకు వీలుగా బీసీసీఐకి తాము ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేశారు.

జాతీయ మీడియాతో కాశీవిశ్వనాథన్ మాట్లాడుతూ..‘అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రూల్‌‌ను తీసుకొస్తున్నారా?లేదా? అన్న విషయం నాకు తెలియదు. దాని గురించి మేము అడగలేదు. ఆ రూల్‌ ఉండొచ్చని బీసీసీఐనే స్వయంగా మాకు చెప్పింది. బోర్డు దాని గురించి ఇంకా ఏం ప్రకటించలేదు. నియమ నిబంధనలను బీసీసీఐనే ప్రకటిస్తుంది.’ అని తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్లను అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లుగానే భావిస్తారు. ధోనీ 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌లో అతన్ని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పరిగణలోకి తీసుకుంటే చెన్నయ్‌కు భారీ మొత్తంలో నిధులు మిగలనున్నాయి. ఎందుకంటే, సీఎస్కే ప్రస్తుతం ధోనీకి రూ. 12 కోట్ల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడికి గరిష్టంగా రూ. 4 కోట్లకే అంటిపెట్టుకోవచ్చు. కాబట్టి, ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌‌గా రిటైన్ చేసుకుంటే సీఎస్కేకు దాదాపు రూ. 8 కోట్ల వరకు మిగులుతాయి. ఆ డబ్బును ఫ్రాంచైజీ వేలంలో ఉపయోగించుకునే వీలు ఉంటుంది. 

Tags:    

Similar News