AP Politics: కొండారెడ్డి బురుజుపై టీడీపీ జెండా..

కర్నూలు కొండారెడ్డి బురుజుపై టీడీపీ జెండా ఎగిరింది.

Update: 2024-06-05 06:25 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కొండారెడ్డి బురుజుపై టీడీపీ జెండా ఎగిరింది. సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న రీతిలోనే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. 11 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ, రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ టీడీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. వైసీపీ ప్రభుత్వం, నేతల అరాచకాలకు ప్రజలు తమ ఓటు ద్వారా చరమగీతం పాడారు.

14లో 11లో టీడీపీ, ఒకటి బీజేపీ విజయం..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. కర్నూలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ తరపున బస్తి నాగరాజు, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ బైరెడ్డి శబరి బరిలో నిలిచి విజయం సాధించారు. అలాగే 14 నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు కొత్త వారికి టీడీపీ కూటమి అవకాశం కల్పించింది.

నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలను టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ 4 స్థానాలు, ఒకటి బీజేపీ, రెండు స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. నంద్యాల పార్లమెంట్ లో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి 1.17 లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు.

అలాగే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీవై రామయ్యపై టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తి నాగరాజు 1.11 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలను ఆర్ఓలు అందజేశారు. జిల్లాలో టీడీపీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 

నంద్యాల పార్లమెంట్ పరిధిలో..

నంద్యాల పార్లమెంట్ పరిధిలో నంద్యాల సెగ్మెంట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ 11,950 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి, మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి 6,650 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బనగానపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి 25,068 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

శ్రీశైలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి 6,385 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి ధారా సుధీర్ పై టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య 14,750 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆళ్లగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డిపై టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ 11,704 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాణ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి 40,604 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కర్నూలు పార్లమెంట్ పరిధిలో..

కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ పై టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ 19,300 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోడుమూరులో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పై టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి 21,746 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పత్తికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు 15,200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బుట్టా రేణుకపై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి 14,816 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదోనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద రెడ్డిపై బీజేపీ అభ్యర్థి పార్థసారథి 18,520 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రా రెడ్డిపై వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి 12,843 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఆలూరులో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ పై వైసీపీ విరుపాక్షి 2,851 ఓట్ల మెజార్టీటీతో గెలుపొందారు. అయితే స్వల్ప మెజార్టీ రావడంతో టీడీపీ అభ్యర్థి రీ కౌంటింగ్ నిర్వహించాలని కోరారు. ఆయన అభ్యర్థన మేరకు అధికారులు రీ కౌంటింగ్ నిర్వహించారు. అందులోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు.


Similar News