Nara Chandrababu: కింగ్ మేకర్‌గా చంద్రబాబు.. కేంద్రంలో కీలక పదవులు..?

ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాదిన ప్రాభవం కోల్పోయింది.

Update: 2024-06-06 06:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాదిన ప్రాభవం కోల్పోయింది. సుమారు 60కి పైగా సీట్లను నష్టపోయింది. దీన్ని భర్తీ చేసుకోవడానికి దక్షిణాదిపై ఆధారపడాల్సి వచ్చింది. బీజేపీకి సొంతంగా 241 సీట్లు వచ్చాయి. అధికారాన్ని చేపట్టేందుకు మ్యాజిక్​ ఫిగర్​ కావాలంటే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిందే. బీహార్‌లో నితీష్​ నుంచి 12 సీట్లు, టీడీపీకి వచ్చిన 16 సీట్లతో కలిపి 28 మంది ఎంపీల మద్దతు అనివార్యం. ఎన్డీయేలో మిగతా భాగస్వామ్య పక్షాల బలం చాలా స్వల్పం. అందుకే చంద్రబాబుకు కమలనాధులు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.

నిబ్బరంగానే చంద్రబాబు..

సందిగ్ద రాజకీయ పరిస్థితులు ఏర్పడినా టీడీపీ అధినేత చంద్రబాబు తొందరపడలేదని తెలుస్తోంది. ఎన్డీయేతో కొనసాగాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలకు సంబంధించి మంత్రి పదవులు అడగాలనుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక నిధులు రాబట్టాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తితోపాటు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కాపాడుకోవాలి.

విశాఖ రైల్వే జోన్​ సాధించాలి. విశాఖ– కాకినాడ పెట్రో కారిడార్‌తోపాటు వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్​తరహా ప్యాకేజీ సాధించుకోవాలి. అందువల్ల కేంద్రం నుంచి ఇవన్నీ రాబట్టాలంటే ప్రభుత్వంలో కీలక శాఖల్లో భాగస్వామ్యం కలిగి ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తో్ంది.

చంద్రబాబు చాణక్యంపై తమ్ముళ్ల నమ్మకం..

రాష్ట్రంలో జనసేనానితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. ఏం చేయాలన్నా కేంద్ర సహకారం తప్పనిసరి. అధికారంలో ఉన్నప్పటికీ గల్లా పెట్టెలో చిల్లి గవ్వ లేకుండా ఏం చేయలేరు. మరోవైపు హామీ ఇచ్చిన పథకాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఇక్కడే చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ సవాళ్లను ఎలా ఎదుర్కుంటారనేది నేడు రాజకీయ వర్గాల నుంచి సామాన్య ప్రజలదాకా చర్చనీయాంశమైంది. 


Similar News