Vineet Joshi: యూజీసీ చైర్మన్గా వినీత్ జోషికి అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాత్కాలిక చైర్మన్గా వినీత్ జోషి నియామకమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తాత్కాలిక చైర్మన్గా వినీత్ జోషి (Vineeth joshi) నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ మాజీ చైర్మన్ జగదీష్ కుమార్ (Jagadheesh kumara) పదవీ కాలం పూర్తి కావడంతో ప్రస్తుత ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా ఉన్న జోషికి అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, యూజీసీ చైర్మన్ శాశ్వత నియామకం జరిగే వరకు వినీత్ ఈ పదవిలో కొనసాగనున్నారు. వినీత్ జోషి 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన మణిపూర్ చీఫ్ సెక్రటరీగా, సీబీఎస్ఈ చైర్మన్గా, మణిపూర్ రెసిడెంట్ కమిషనర్గా పనిచేశారు. అంతేగాక వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో అనేక కీలక పదవుల్లోనూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర అదనపు బాధ్యతలు అప్పగించింది.
కాగా, ఏప్రిల్ 7వ తేదీన యూజీసీ చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ పదవీ విరమణ చేశారు. 2022లో ఆయన యూజీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలంలో యూజీసీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.