మాతృభాషలో పాపులర్ నినాదం తప్పుగా రాసిన కేంద్ర మంత్రి.. కాంగ్రెస్ సెటైర్

మాతృభాషలో పాపులర్ నినాదం సరిగా రాయలేకపోయిన కేంద్ర మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

Update: 2024-06-19 12:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో తడబడటం చూస్తుంటాం. మరి కొందరు ఏదో చెప్పబోయి టంగ్ స్లిప్ కారణంగా మరోదో చెప్పేసి ప్రత్యర్థులకు దొరికిపోతుంటారు. అయితే తాజాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయమంత్రి సావిత్రి ఠాకుర్.. తన మాతృభాషలో పాపులర్ నినాదాన్ని తప్పుగా రాసి విపక్షాలకు టార్గెట్ గా మారారు. మధ్యప్రదేశ్ లోని ధార్ నియోజకవర్గం నుంచి ఇటీవల ఎంపీగా ఎన్నికైన సావిత్రికి కేబినెట్ లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యప్రదేశ్ ల నిర్వహించిన 'స్కూల్ ఛలో అభియాన్' కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ బోర్డుపై 'బేటీ బచావో, బేటీ పడావో' నినాదాన్ని హిందీలో రాసింది. అయితే ఆ పదాలను ఆమె తప్పుగా రాసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో సావిత్రిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నేత కేకే విశ్రా స్పందిస్తూ.. రాజ్యాంగ పదవుల్లో ఉండి అతి పెద్ద మంత్రిత్వ శాఖ బాధ్యతలను చూసుకుంటూ కనీసం మాతృభాషలో కూడా రాయలేకపోవడం శోఛనీయం అంటూ విమర్శించారు. ఇలాంటి వారు తమ మంత్రిత్వ శాఖను ఎలా నిర్వహిస్తారో అని సెటైర్ వేశారు. ఈ విమర్శలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అది హడావుడిలో జరిగిన పొరపాటు అని ఆదివాసీ వర్గానికి చెందిన మహిళా అని కూడా చూడకుండా ఈవిషయంలో కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని ధార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మనోజ్ సోమాని మండిపడ్డారు. ఠాకూర్ చేసిన తప్పును విమర్శించడంలో కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక ఆలోచన కనిపిస్తోందని గిరిజన మహిళను అవమానిస్తున్న కాంగ్రెస్ ను గిరిజన సమాజం క్షమించదని అన్నారు.

Tags:    

Similar News