Union Budget 2024 : బడ్జెట్‌పై ఖర్గే, నితీశ్, రబ్రీ, యోగి, దీదీ ఏమన్నారంటే..

‘‘ఇది కుర్సీ బచావో బడ్జెట్. ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనే తాపత్రయం బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా కనిపించింది. దేశ ప్రజలకు మాత్రం నిరాశే మిగిలింది.

Update: 2024-07-23 13:00 GMT

కేంద్ర బడ్జెట్‌పై పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీల ముఖ్య నేతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయ్.. 

కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఏమన్నారంటే..

‘‘ఇది కుర్సీ బచావో బడ్జెట్. ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనే తాపత్రయం బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా కనిపించింది. దేశ ప్రజలకు మాత్రం నిరాశే మిగిలింది. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), పురుగుమందులపై రాయితీ వంటి వాటి ప్రస్తావనే లేదు. రైలు ప్రమాదాలు జరుగుతున్నా.. రైల్వే ట్రాక్స్, ప్రయాణికుల భద్రతకు కేటాయింపులు చేయలేదు. మొత్తం మీద ఇదొక కాపీక్యాట్ బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రాన్ని కూడా అది సరిగ్గా కాపీ చేయలేకపోయింది’’ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘‘జనాభా గణన లేకుండా ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్‌ ఇది. ఇందులో పేదలు అనే పదాన్ని సెల్ఫ్ బ్రాండింగ్ కోసం వాడుకున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

అది రాజకీయ పక్షపాత బడ్జెట్ : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

‘‘కేంద్ర బడ్జెట్ రాజకీయ పక్షపాతంతో కూడుకొని ఉంది. దానిలోని ప్రతిపాదనలు పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయి. రాష్ట్రాలను బలహీనం చేసేలా కేంద్ర బడ్జెట్‌ను రూపుదిద్దారు. పశ్చిమ బెంగాల్‌ ఏ తప్పు చేసిందని బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కకుండా చేశారు ? బీజేపీ రాజకీయ మిషన్‌‌ను నెరవేర్చుకునే మార్గాలే బడ్జెట్‌లో ఉన్నాయి’’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

140 కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

‘‘దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో రూపొందించిన బడ్జెట్ ఇది. అందరినీ కలుపుకొనిపోయేలా దీన్ని తయారు చేశారు. బడ్జెట్ ప్రధాన ఫోకస్ అభివృద్ధిపై ఉంది. రైతుల శ్రేయస్సు కోసం రూ.1,52,000 కోట్లు, మహిళా సాధికారత కోసం రూ.3 లక్షల కోట్లను కేటాయించారు. భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అడుగులు పడ్డాయి. యువతకు లక్షలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయి’’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

‘స్టేటస్’ ఇవ్వకుంటే నిధులివ్వమన్నాం.. ఇచ్చారు : బిహార్ సీఎం నితీశ్ కుమార్

‘‘మేం బిహార్‌కు ప్రత్యేక హోదా అడిగాం. ఆ ఛాన్స్ లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలా అయితే కనీసం డెవలప్మెంట్ కోసం భారీగా నిధులివ్వమని మేం కోరాము. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. దానిలో భాగంగానే బడ్జెట్‌లో మా రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించారు. మౌలిక సదుపాయాల వికాసానికి రూ.26వేల కోట్లు ఇచ్చారు. ఇక మా రాష్ట్రాన్ని పురోగతి బాటలో తీసుకెళ్తాం’’ అని బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పేర్కొన్నారు.

ఆ 26వేల కోట్లు ఒక 'ఝుంఝునా' : బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి

‘‘బిహార్‌లో అశాంతి నెలకొంది. దొంగతనాలు, లూటీలతో ప్రజలు అభద్రతగా ఫీలవుతున్నారు. భారీ వర్షాలకు వరద నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. యువతకు ఉపాధి దొరకడం లేదు. రైతుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించే నాథుడు కనిపించడం లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిన్న పిల్లవాడి చేతిలో ఆట వస్తువు(ఝుంఝునా) పెట్టినట్టుగా.. బిహార్‌లో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రూ.26వేల కోట్లను కేంద్రం కేటాయించింది’’ అని బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి(లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి) మండిపడ్డారు.

Tags:    

Similar News