Unified Pension Scheme: ‘యూపీఎస్‌’కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా రికార్డు

రాష్ట్రంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్) అమలు చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-26 08:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యూపీఎస్) అమలు చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్ర కేబినెట్ డిసిషన్ ప్రకారం..ఈ ఏడాది మార్చి నుంచి రాష్ట్రంలో యూపీఎస్ అమలులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ స్కీమ్ ప్రయోజనాలు లభించనున్నాయి. కాగా, ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2004 జనవరి 1 తర్వాత విధుల్లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటే ఈ స్కీమ్ అమలు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదం తెలిపింది.

నదుల అనుసంధాన ప్రణాళికకూ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు, వారికి పగటిపూట విద్యుత్ అందేలా చేసేందుకు నిరంతర విద్యుత్ సరఫరా పథకాన్ని విస్తరించేందుకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదనంగా, రూ. 7,000 కోట్లతో నార్-పర్-గిర్నా నది అనుసంధాన ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. ఇది ప్రధానంగా ఉత్తర మహారాష్ట్ర జిల్లాలైన నాసిక్, జల్గావ్‌లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో నార్, పర్, ఔరంగ నదుల నుంచి 9.19 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, 14.56 కిలోమీటర్ల సొరంగం ద్వారా తీసుకువెళ్లి, చంకపూర్ ఆనకట్ట సమీపంలోని గిర్నా నది పరీవాహక ప్రాంతంలో విడుదల చేస్తారు. నీటిపారుదల కింద దాదాపు 50,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వర్గం తెలిపింది. 

Tags:    

Similar News