ట్రిపుల్ తలాక్’ ప్రమాదకరం.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

ముస్లిం మతంలో ఆచరించే ట్రిపుల్ తలాక్ సంప్రదాయం చాలా ప్రమాదకరమని కేంద్రం తెలిపింది. ఈ పద్దతి వల్ల అనేక మంది ముస్లిం మహిళలు దయనీయమైన స్థితిలోకి నెట్టబడ్డారని పేర్కొంది.

Update: 2024-08-19 12:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముస్లిం మతంలో ఆచరించే ట్రిపుల్ తలాక్ సంప్రదాయం చాలా ప్రమాదకరమని కేంద్రం తెలిపింది. ఈ పద్దతి వల్ల అనేక మంది ముస్లిం మహిళలు దయనీయమైన స్థితిలోకి నెట్టబడ్డారని పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థించింది. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకోకుండా వివాహిత ముస్లిం మహిళలను రక్షించేందుకే ఈ చట్టాన్ని ఆమోదించామని తెలిపింది. ఈ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ, ముస్లిం సమాజం దీనిని పారదోలడానికి చర్యలు తీసుకోలేదని, అందుకే చట్టం చేశామని పేర్కొంది. వివాహిత ముస్లిం మహిళలకు లింగ న్యాయం, లింగ సమానత్వాన్ని నిర్ధారించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని తేల్చి చెప్పింది. అంతేగాక వివాహిత ముస్లిం మహిళల హక్కులను కూడా పరిరక్షిస్తుందని స్పష్టం చేసింది.

కాగా, 2017 ఆగస్ట్ 22 ట్రిపుల్ తలాక్ సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం 2019 జూలై 30న ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించింది. ఇందులో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించారు. అయితే జమియత్ ఉలమా-ఏ-హింద్, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా అనే రెండు ముస్లిం సంస్థలు ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పేర్కొన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు పంపగా..తాజాగా కేంద్రం సమాధానమిచ్చింది. 

Tags:    

Similar News