బిహార్‌లో 25కు చేరిన మృతులు.. సీఎం నితీశ్ కుమార్ కీలక ఆదేశాలు

బిహార్ కల్తీ మద్యం కేసులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది. ఇప్పటివరకు 25 మంది కల్తీ మద్యం తాగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గురువారం ధృవీకరించారు.

Update: 2024-10-17 16:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ కల్తీ మద్యం కేసులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది. ఇప్పటివరకు 25 మంది కల్తీ మద్యం తాగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గురువారం ధృవీకరించారు. బిహార్ రాష్ట్రంలోని సరన్ మరియు సివన్ జిల్లాల్లో ఈ కల్తీ మద్యం ఘటన వెలుగుచూసింది. ఇండస్ట్రీయల్ స్పిరిట్‌లో మిథైల్ అల్కహాల్ కలిపిన నకిలీ మద్యం సేవించడం ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. పరిస్థితి విషమంగా ఉండటంతో పలువురు కల్తీ మద్యం బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులతో హై లెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఘటనకు గల కారకులను కఠినంగా శిక్షించాలని డీజీపీ అలోక్ రాజ్‌‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఘటన జరిగిన రెండు జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపేందుకు రెండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందాల(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు బిహార్ ప్రభుత్వం పేర్కొంది. కాగా, కల్తీ మద్యం కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం 49 మంది ఈ ఘటనలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News