West Bengal: రక్షించాల్సిన పోలీసులే కుట్రదారులుగా మారారు: పశ్చిమ బెంగాల్ గవర్నర్

వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్యాంపస్‌ ద్వంసమైన ప్రదేశాన్ని గవర్నర్ సందర్శించారు.

Update: 2024-08-15 13:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్లోని ఒక వర్గం రాజకీయ రంగు పులుముకుందని, నేరపూరితమైందని ఆరోపణలు చేశారు. ఇటీవల ఓ ట్రైనీ మహిళా వైద్యురాలి సాముహిక అత్యాచారం, హత్య ఘటనపై ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్యాంపస్‌లో ద్వంసమైన ప్రదేశాన్ని గవర్నర్ సందర్శించారు. 'తాను చూసింది, విన్నది దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈ ఘటన బెంగాల్‌తో పాటు మానవత్వానికే సిగ్గుచేటు. మన చుట్టూ నెలకొన్న హీనస్థితికి ఇది నిదర్శనం ' అని ఆనంద బోస్ విచారం వ్యక్తం చేశారు. 'చట్టాన్ని రక్షించాల్సినవారే కుట్రదారులుగా మారారు. పోలీసుల్లో ఒక వర్గం రాజకీయ, నేరపూరితంగా మారిపోయింది. ఈ తెగులును అంతం చేయాలి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాత్రిపూటైనా సరే పనికి వెళ్తే క్షేమంగా ఉండాలి, రక్తపాతం కాకూడదని అన్నారు. దీనికి ముందు విద్యార్థులతో మాట్లాడిన గవర్నర్.. మీకు న్యాయం జరుగుతుంది. స్వయంగా మీ మాటలు వినేందుకు వచ్చాను. ఈ ఘటనపై పోరాడుదాం, గెలుస్తామని అన్నారు. ఇకమీదట రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి ఘోరమైన దాడులు జరిగేందుకు అనుమతించబోం. మీకు అండగా ఉంటామని, కేసు త్వరితగతిన ముందుకెళ్లేందుకు అవసరమిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ భరోసా ఇచ్చారు. 

Tags:    

Similar News