Shashi tharoor: వయనాడ్ విషాదం..వివాదాస్పదంగా మారిన శశిథరూర్ పోస్ట్

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది.

Update: 2024-08-04 08:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. శశిథరూర్ శనివారం కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటించారు. పలు సహాయక చర్యల్లో పాల్గొని, రెండు ట్రక్కుల సామగ్రిని బాధితులకు అందజేశారు. ఈ సామగ్రిని ఆయనే స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన తన పర్యటనను ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘సహాయక శిబిరాల్లో ఆహార కొరత ఉంది. నిరాశ్రయులు నేలపైనే నిద్రిస్తున్నారు. వారి కోసం కొంత సామగ్రిని అందించాం’ అని తెలిపారు. అంతేగాక ఇది నాకొక మరపురాని రోజు అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పించారు. ఈ విషాదాన్ని ‘చిరస్మరణీయమైన’ రోజుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నింశారు. బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా కూడా థరూర్ పోస్ట్‌పై స్పందిస్తూ.. శశి థరూర్‌కు మరణాలు, విపత్తులు మెమోరబుల్ డేనా అని నిలదీశారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ స్పందించి తన పోస్టుపై వివరణ ఇచ్చారు. తను ఉపయోగించిన మెమోరబుల్ అనే పదానికి వివరణ ఇచ్చారు. మెమోరబుల్ అంటే గుర్తుంచుకోదగిన, గుర్తుండిపోయే ఘటనను మెమోరబుల్‌గా పేర్కొంటారని తెలిపారు. ఈ విషాదాన్ని మర్చిపోలేదనే ఉద్దేశంతోనే పోస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News