నేపాల్‌లో నదిలో గల్లంతైన 63 మంది కోసం కొనసాగుతున్న గాలింపు

శుక్రవారం ఉదయం నేపాల్‌లో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోగా, ఈ ఘటనలో బస్సులో ఉన్న 63 మంది జాడ ఇంకా తెలియరాలేదు.

Update: 2024-07-13 09:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శుక్రవారం ఉదయం నేపాల్‌లో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోగా, ఈ ఘటనలో బస్సులో ఉన్న 63 మంది జాడ ఇంకా తెలియరాలేదు. శనివారం తెల్లవారుజామున రెస్క్యూ బృందాలు తమ ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించాయి. శుక్రవారం ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే రాత్రి వరకు గాలింపు చేపట్టిన బృందాలు ఆ తర్వాత చీకట్లో నదిలో భీకర ప్రవాహాం, బురద కారణంగా తీవ్ర అడ్డంకులు ఎదుర్కొనవడంతో కాసేపు విరామం ఇచ్చి శనివారం తెల్లవారుజామున తిరిగి తమ ఆపరేషన్‌ను కొనసాగించారు.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం భారీగా పెరుగుతుంది. డజన్ల కొద్దీ రెస్క్యూ బృంద సభ్యులు నదిలోకి దిగి గాలింపు చేపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు వాహనాలు, అందులో ఉన్నవారి ఆనవాళ్లు దొరకలేదు. మరోవైపు బస్సులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఒక అధికారి తెలిపారు. గల్లంతైన ప్రయాణికుల్లో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు. కొండచరియలు విరిగి పడకముందే ముగ్గురు ప్రయాణికులు బస్సుల్లోంచి దూకగా, వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చిత్వాన్ జిల్లా చీఫ్ ఇంద్ర దేవ్ యాదవ్ మాట్లాడుతూ, మేము సాధ్యమైన అన్ని ప్రదేశాలను శోధిస్తున్నాము. భారీ ప్రవాహం, బురద ఉన్నప్పటికి కూడా మా సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి వారిని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News