Karnataka: ఎస్సీ, ఎస్టీలను వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకం: సీఎం సిద్ధరామయ్య

ఈ తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని సిద్ధరామయ్య ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Update: 2024-08-01 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఇది 'చారిత్రాత్మక' నిర్ణయమని అన్నారు. షెడ్యూల్డ్ కులాల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి, వారికి రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ తీర్పును నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని సిద్ధరామయ్య ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతర్గత రిజర్వేషన్ల అమలులో ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. క్రీమీలేయర్‌తో సహా తీర్పులోని వివాదాస్పద అంశాలకు సంబంధించి షెడ్యూల్డ్ కులాల నేతలు, న్యాయ నిపుణులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటాం' అన్నారాయన. ఇదే సమయంలో షెడ్యూల్డ్ కులాల్లో అంతర్గత రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. జస్టిస్ ఎ.జె సదాశివ అధ్యక్షతన కమిటీ నివేదికను అమలు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.  

Tags:    

Similar News