Howrah-Mumbai Express: రైలు మంత్రి ఓ రీల్ మంత్రి.. కేంద్రంపై ప్రతిపక్షాల విమర్శలు

జార్ఖండ్ రైలు ప్రమాదంపై ప్రతిపక్షాలు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.

Update: 2024-07-30 08:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ రైలు ప్రమాదంపై ప్రతిపక్షాలు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్రానికి చురకలు అంటించారు. రైలు భద్రత విషయానికి వస్తే ప్రభుత్వ ట్రాక్ రికార్డ్‌ను బ్రేక్ చేసిందన్నారు. " కేంద్ర ప్రభుత్వం రైలు ప్రమాదాలలో రికార్డు సృష్టించాలనుకుంటోంది. రికార్డు స్థాయిలో పేపర్ లీక్‌లు జరిగాయి. ఇప్పుడు రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని సోషల్ మీడియాలో కేంద్రంపై అఖిలేష్ నిప్పులు చెరిగారు.

మమతా బెనర్జీ

దేశంలో రైలు ప్రమాద ఘటనలు సర్వసాధారణమైపోయాయని మమతా బెనర్జీ అన్నారు. ప్రతివారం ఎక్కడో ఓ దగ్గర రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ‘మరో ఘోరమైన రైలు ప్రమాదం..! మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో హౌరా – ముంబై రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కొందరు చనిపోగా.. భారీ సంఖ్యలో గాయపడ్డారు. దేశంలో రైలు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. ప్రతివారం ఎక్కడో ఓ దగ్గర రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం వీటిని సహించాలని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నా. ఇదేనా పాలన? కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంతు లేదా..?’ అని ఎక్స్‌ వేదికగా మోడీ సర్కార్‌ను దీదీ నిలదీశారు.

ప్రభుత్వంపై విమర్శలు

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇదో దారుణమైన ఘటన అని ఆరోపించారు. రైలు సంబంధిత ప్రమాదాల గురించి తరచూ జరుగుతున్నాయని.. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. "అనేక మరణాలు జరిగాయి. ఇప్పటి వరకు ఎటువంటి జవాబుదారీతనం చూపించట్లేదు. ఈ ప్రమాదం కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపదని నేను భావిస్తున్నాను. పరిహారం ప్రకటించండి. విచారణకు హామీ ఇవ్వండి. మరో ఇన్ స్ట్రాగ్రామ్ పీఆర్ రీల్ కు వెళ్లండి" అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రియాంక చతుర్వి మండిపడ్డారు. ఆయన్ని "రీల్ మంత్రి" అని ఆయనపై సెటైర్ వేశారు. రైళ్లలో పెరుగుతున్న రద్దీ గురించి విమర్శలు గుప్పించారు. "ప్రజలు టాయిలెట్లలో ప్రయాణిస్తున్నా.. ప్రభుత్వం మాచ్రం సిగ్గుపడట్లేదు" అని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుస్మితా దేవ్, సాగరికా ఘోష్ రైల్వే మంత్రిత్వ శాఖపై విరుచుకుపడ్డారు. ఎలాంటి జవాబుతారీదనం లేదని మండపిడ్డారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కూడా కేంద్రంపై విరుచుకుపడింది. సోషల్ మీడియాలో రీల్స్ చేయడానికి బదులుగా రైల్వేలపై దృష్టి పెట్టాలని రైల్వే మంత్రిని కోరింది. ఇకపోతే, మంగళవారం తెల్లవారుజామున హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు.


Similar News